Shiv Sena: శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ఇంట్లో ఈడీ సోదాలు

  • ఈ ఉదయం తెల్లవారుజామునే ఇంటిపై దాడి చేసిన  అధికారులు
  • పత్రాచల్ భూ కుంభకోణం కేసులో సోదాలు చేస్తున్న ఈడీ
  • తాను శివసేనను విడిచిపెట్టను, పోరాడుతూనే ఉంటానని సంజయ్  రౌత్ ట్వీట్
 Will keep fighting tweets Sanjay Raut as ED shows up at his home

మహారాష్ట్ర ఎంపీ, శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ నివాసంలో ఆదివారం ఉదయం ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పత్రాచల్‌ భూ కుంభకోణం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని శివసేన మద్దతు దారులు చెబుతున్నారు. రౌత్ మద్దతుదారులు ఆయన నివాసం వెలుపల గుమిగూడారు. ఈడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తనపై ఈడీ చర్యల నేపథ్యంలో తాను శివసేనను విడిచిపెట్టబోనని, పోరాడుతూనే ఉంటానని రౌత్ ట్వీట్ చేశారు. 

సంజయ్‌ రౌత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈడీ ఏప్రిల్‌లో రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. పత్రాచల్ భూ కుంభకోణంలో (మనీలాండరింగ్‌ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు  ఫిర్యాదులు రావడంతో ఇది వరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. 

అయితే,  ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, ఆగస్టు 7 తర్వాత మాత్రమే హాజరవుతానని రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ ఉదయం తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వచ్చి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించాయి. సంజయ్‌ రౌత్‌ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.

More Telugu News