Ola: ఓలా టూ వీలర్లకు తగ్గిన డిమాండ్.. ప్లాంట్ లో తయారీ నిలిపివేత!

  • తమిళనాడులోని కృష్ణగిరిలో ఓలాకు అతిపెద్ద ప్లాంట్
  • 21 నుంచి ఆగిపోయిన తయారీ కార్యకలాపాలు
  • వార్షిక మరమ్మతుల నిర్వహణ కోసమేనన్న కంపెనీ
  • వాహన నిల్వలు పేరుకుపోవడం వల్లేనన్న సందేహం
Ola Electric suspends production

ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ తగ్గిందా..? ఇటీవలి వేసవి సీజన్ లో పలు ప్రాంతాల్లో ఓలా స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు కస్టమర్లను ప్రత్యామ్నాయం దిశగా ఆలోచింపజేస్తున్నాయా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని హోసూరు జిల్లా కృష్ణగిరిలో ఉన్న తన ప్లాంట్ లో తయారీ కార్యకలాపాలను నిలిపివేసింది. వార్షిక నిర్వహణ కోసమే నిలిపివేసినట్టు కంపెనీ చెబుతోంది. నిజానికి ఇక్కడ తయారీ మొదలు పెట్టి ఎనిమిది నెలలే అవుతోంది. ఇంతలోనే మరమ్మతులు ఏంటన్నది సందేహం కలిగిస్తోంది. 

కానీ, ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు మాత్రం స్కూటర్ల నిల్వలు పేరుకుపోవడం వల్లే తయారీని నిలిపివేయడం వెనుక కారణమని చెబుతున్నాయి. ఓలా తమిళనాడులో భారీ పెట్టుబడితో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల యూనిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ సుమారు 4,000కు పైగా ద్విచక్ర వాహనాల నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఇక్కడ ప్రతి రోజూ 600 యూనిట్లను తయారు చేయగల సామర్థ్యం ఉండగా, కంపెనీ కేవలం 100 యూనిట్లనే ఉత్పత్తి చేస్తోంది. జులై 21 నుంచి తమిళనాడు ప్లాంటులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

అయినా కానీ, ఎలక్ట్రిక్ విభాగంపై ఓలా భారీ అంచనాలతోనే ఉంది. మరింత విస్తరించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వాహన కార్యకలాపాల కోసం మరింత మందిని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. అదే సమయంలో ఇతర విభాగాల నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించనుంది.

More Telugu News