Vijayasai Reddy: కేంద్రం కంటే ఏపీ ఆర్థిక పరిస్థితే మెరుగ్గా ఉంది... చంద్రబాబు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: విజయసాయి

  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై విజయసాయి వివరణ
  • కేంద్రంతో ఏపీ ఆర్థిక పరిస్థితిని పోల్చిన వైనం
  • శ్రీలంక కంటే మనమే మేలని వెల్లడి
  • గణాంకాలతో సహా వివరణ
Vijayasai Reddy explains state financial condition

ఏపీలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, విపక్ష నేత చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సీఎం జగన్ వంటి  సమర్థ నాయకుడి చేతిలో ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కంటే ఏపీ ఆర్థిక పరిస్థితే మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పట్ల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని అన్నారు. 

"చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతోందని పదేపదే చెబుతున్నాడు. అయితే, ఏపీ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. అన్ని ఆర్థిక సూచీలు అదుపులోనే ఉన్నాయి. 

జులై 19వ తేదీన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆర్థికశాఖల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో శ్రీలంక పరిస్థితులను ఎంపీలకు వివరించి, మనం ఎలా మద్దతు ఇవ్వాలో వివరించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక పరిస్థితులను కూడా ఆ సమావేశంలో చర్చించారు. దాంట్లో కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని వారు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అది మనకు కూడా వర్తిస్తుందన్నది అర్థం చేసుకోవాలి" అని హితవు పలికారు. 

ఇక, రాష్ట్ర అప్పు, జీడీపీ నిష్పత్తి శాతాన్ని కేంద్ర శాతంతో పోల్చే ప్రయత్నం చేశారు. 2021-22వ సంవత్సరంలో కేంద్రం అప్పు-జీడీపీ నిష్పత్తి 57 శాతం అని వెల్లడించారు. అదే సమయంలో పంజాబ్ నిష్పత్తి శాతం 47గా ఉందని, ఏపీ అప్పు-జీడీపీ నిష్పత్తి శాతాన్ని చూస్తే 32.4 శాతం అని విజయసాయి వివరించారు. దీన్ని ఒక వరుసక్రమంలో తీసుకుంటే ఏపీ 5వ స్థానంలో ఉంటుందని వెల్లడించారు. ఎక్కడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితులు లేవని, ఒకరకంగా కేంద్రం కంటే మనమే చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. 

ఏపీ ఆర్థికలోటు రూ.8,500 కోట్లు అని, ద్రవ్యలోటు రూ.25,194.62 కోట్లు అని విజయసాయి వెల్లడించారు. దీన్ని ద్రవ్యలోటు-జీఎస్డీపీ నిష్పత్తి ప్రకారం చూస్తే 2.1 శాతం కంటే తక్కువే వస్తుందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఇది 4.5 శాతం ఉండాలన్న పరిమితి ప్రకారం చూసినా, ఏపీ 2.1 శాతంతో మెరుగైన స్థితిలోనే ఉందని వివరించారు. 2021-22లో కేంద్రం ద్రవ్యలోటు 6.9 శాతం ఉందని, ఏపీ ద్రవ్యలోటు 3.18 శాతం అని వివరించారు. 

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఎందుకు కూరుకుపోయిందో విజయసాయి విశ్లేషించారు. ఎగుమతులు తగ్గిపోయాయని, రాబడి చెల్లింపులు తగ్గిపోయాయని తెలిపారు. అదే సమయంలో దేశంలోకి దిగుమతులు పెరిగిపోయాయని, అక్కడ అనుసరించిన సేంద్రియ వ్యవసాయంతో ఉత్పత్తి తగ్గిపోయిందని, పర్యాటక రంగం కూడా కుంటుపడిందని తెలిపారు. శ్రీలంక కరెన్సీ విలువ పడిపోయిందని, తద్వారా శ్రీలంక సంక్షోభంలో చిక్కుకుందన్న విషయం అందరికీ తెలిసిందేని అన్నారు. కానీ చంద్రబాబునాయుడికి మాత్రం తెలియడంలేదని ఎద్దేవా చేశారు. 

2019-20లో శ్రీలంక మొత్తం వాణిజ్యం ఎగుమతుల విలువ 12.9 బిలియన్ డాలర్లు కాగా, ఏపీ ఎగుమతుల విలువ రూ.85,665 కోట్లు అని విజయసాయి వెల్లడించారు. 2021లో చూస్తే శ్రీలంక ఎగుమతుల విలువ 12 మిలియన్ డాలర్ల లోపే ఉందని, అదే సమయంలో ఏపీ ఎగుమతుల విలువలో 62 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు. రూ.85,665 కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు చేరిందని గణాంక సహితంగా వివరించారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతోందనడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు.

More Telugu News