PV Sindhu: నేటి నుంచే కామన్వెల్త్​ గేమ్స్..​ పీవీ సింధుకు అరుదైన అవకాశం

  • నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా ఎంపికైన సింధు 
  • టాప్‌5లో చోటే లక్ష్యంగా బరిలోకి  భారత జట్టు
  • ఈసారి షూటింగ్‌ లేకపోవడం లోటు
PV Sindhu to be Team India Flagbearer at the CWG 2022 opening ceremony

నాలుగేళ్లకు ఒకసారి జరిగే కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా గురువారం ఈ పోటీలు మొదలవుతాయి. 11 రోజుల పాటు జరిగే మెగా ఈవెంట్‌లో 72 దేశాల నుంచి 4500 పైచిలుకు క్రీడాకారులు 20 స్పోర్టింగ్‌ ఈవెంట్లలో పోటీపడనున్నారు. 

కామన్వెల్త్‌లో అతి పెద్ద దేశమైన భారత్ ఈసారి భారీ బృందంతో బరిలో నిలిచింది. పతకాల పట్టికలో మొదటి స్థానాల్లో చోటే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ బలంగా ఉన్న షూటింగ్ క్రీడను ఈ కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత పతక అవకాశాలను దెబ్బతీయనుంది. దాంతో ఈ సారి వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్ పై భారత జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆరంభ వేడుకల్లో భారత జట్టుకు పతాకధారిగా వ్యవహరించనుంది. గురువారం రాత్రి 11.30కు మొదలయ్యే వేడుకల్లో  సింధు.. జాతీయ పతాకాన్ని పట్టుకుని అథ్లెట్ల బృందం ముందు నడవనుంది. ఈ మేరకు ఇండియా ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) తెలుగమ్మాయి పేరును ఖరారు చేసింది. భారత్ నుంచి 164 మంది అథ్లెట్లు ఈ వేడుకలో పాల్గొంటారు. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌లోనూ సింధు పతాకధారిగా వ్యవహరించింది. దాంతో, వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకధారి అయిన క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది.

More Telugu News