Nirmala Sitharaman: రాష్ట్రపత్ని వివాదం... ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా లైంగికంగా వేధించడమేనన్న నిర్మలా సీతారామన్

  • ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అన్న అధిర్ రంజన్ చౌధురి
  • మహిళా రాష్ట్రపతిని కించపరిచేలా మాట్లాడేందుకు సోనియా అవకాశం ఇచ్చారన్న నిర్మల
  • దేశ ప్రజలకు సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్
This is deliberate sexist abuse says Nirmala Sitharaman

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పార్లమెంటు సైతం ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అట్టుడుకుతోంది. బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామరామన్ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా లైంగికంగా వేధించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ అయివుండి కూడా అత్యున్నత రాష్ట్రపతి హోదాలో ఉన్న మహిళను కించపరిచేలా మాట్లాడేందుకు వారి పార్టీ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు సోనియా క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. దేశ ప్రజల ముందుకు వచ్చి సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News