neeraj chopra: కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్​కు షాక్.. పతాకధారి నీరజ్​ చోప్రాకు గాయం

  • క్రీడలకు దూరమైన నీరజ్
  • ప్రపంచ అథ్లెటిక్స్ లో రజతంతో చరిత్ర సృష్టించిన చోప్రా
  • ఫైనల్లో పోటీ పడుతుండగా గజ్జల్లో గాయం
Neeraj Chopra pulling out of CWG 2022 with injury

బర్మింగ్ హామ్ వేదికగా గురువారం మొదలయ్యే కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించాల్సిన స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. గేమ్స్‌ నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా తాను గేమ్స్‌కు అందుబాటులో ఉండటం లేదని నీరజ్‌ ప్రకటించాడు. 

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా చోప్రాకు గాయమైంది. అయినప్పటికీ ఆ పోటీల్లో నీరజ్ రజతంతో చరిత్ర సృష్టించాడు. టోర్నీ తర్వాత నీరజ్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించిన వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని అతనికి సూచించారు. 

దాంతో, కామన్వెల్త్ లో స్వర్ణ పతకం గెలుస్తాడనుకున్న చోప్రా పోటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2018లో జరిగిన గత ఎడిషన్లో నెగ్గిన స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోతున్నందుకు బాధగా ఉందని నీరజ్ చెప్పారు. ఇప్పుడు గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టనున్న చోప్రా.. కామన్వెల్త్ క్రీడల్లో తోటి భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు తనలో కలిసి రావాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.

More Telugu News