Taliban: తాలిబన్ల రాక్షసత్వం.. వ్యక్తిని కాల్చి చంపి, మార్కెట్లో వేలాడదీసిన వైనం

  • ఆప్ఘనిస్థాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల కిరాతకాలు
  • యువకుడిని కిరాతకంగా కాల్చి చంపిన వైనం
  • మృత దేహంతో నిరసన వ్యక్తం చేసిన స్థానికులు
Talibans killed young man

తాలిబన్లు అంటేనే అంతులేని రాక్షసత్వం. ఇప్పటి వరకు వారు చేసిన దారుణాలు కోకొల్లలు. తాజాగా వారు మరో కిరాతకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ లోని బగ్లాన్ ప్రావిన్స్ లో అందరాబ్ జిల్లాలో ఒక యువకుడని వారు కాల్చి చంపారు. అనంతరం... అతని మృతదేహాన్ని మార్కెట్ దగ్గరకు తీసుకెళ్లి బహిరంగంగా వేలాడదీశారు. ఈ దారుణ ఘటన అందరికీ ఒళ్లు జలదరించేలా చేస్తోంది. 

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం... కసా తరాష్ ప్రాంతంలోని అందరాబ్ లో ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈ నెల 20న అతని వద్దకు తాలిబన్లు వెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు రావాలని ఆదేశించారు. అతను బయటకు వచ్చిన వెంటనే కాల్చి చంపారు. అతని ఇంటి ముందు నిలబడిన జనాలను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

అనంతరం డెడ్ బాడీని తీసుకొచ్చి మార్కెట్ వద్ద వేలాడదీసి దుశ్చర్యకు పాల్పడ్డారు. అతన్ని ఎందుకు హతమార్చారనే విషయం మాత్రం తెలియరాలేదు. అనంతరం మృత దేహంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తర్వాత చాలామందిని చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.

More Telugu News