Umardeen: మామిడికాయ కావాలని మారాం చేసిన మేనకోడల్ని చంపేపిన కిరాతకుడు

  • యూపీలో ఘోరం
  • వ్యక్తి అన్నం తింటుండగా వచ్చిన మేనకోడలు
  • మామిడికాయ కావాలని పదేపదే కోరిన వైనం
  • ఇనుపరాడ్ తో కొట్టి, కత్తితో గొంతుకోసిన వ్యక్తి
Uttar Pradesh man killed his niece

ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. మామిడికాయ కావాలని మారాం చేసిన చిన్నారిని ఓ కిరాతకుడు దారుణరీతిలో కడతేర్చాడు. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీలో ఈ ఘటన జరిగింది. 33 ఏళ్ల ఉమర్దీన్ అనే వ్యక్తి భోజనం చేస్తుండగా మేనకోడలు ఖైరూ నిషా (5) అక్కడికి వచ్చింది. మామిడికాయ కావాలంటూ అతడిని పదేపదే కోరింది. దాంతో, తీవ్ర అసహనానికి లోనైన ఉమర్దీన్ ఓ రాడ్ తీసుకుని ఆ చిన్నారి తలపై కొట్టాడు. ఆపై పదునైన వస్తువుతో గొంతుకోశాడు. దాంతో తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక మృతి చెందింది. 

ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కాడు. కాగా, తమ కుమార్తె కనిపించకపోవడంతో ఖైరూ నిషా తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. ఉమర్దీన్ కూడా ఏమీ ఎరగనివాడిలా గ్రామస్తులతో పాటే బాలిక కోసం వెదికాడు. అయితే, పోలీసులు అతడిని అనుమానించడంతో పారిపోయాడు. 

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఎట్టకేలకు నిందితుడ్ని గురువారం రాత్రి ఓ అటవీప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి హత్యకు ఉపయోగించిన ఓ ఐరన్ రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News