Laptop Protest: కేరళలో 'ల్యాప్ టాప్ నిరసన' తెలిపిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు... వివరాలు ఇవిగో!

  • విద్యార్థుల తీరుపై స్థానికుల ఆగ్రహం
  • బస్ షెల్టర్ బెంచీని మూడు ముక్కలుగా విడగొట్టిన వైనం
  • విద్యార్థి ఒళ్లో విద్యార్థినులు కూర్చుని నిరసనలు
  • స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామన్న విద్యార్థులు
Kerala students laptop protest goes viral on internet

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల తీరుకు వ్యతిరేకంగా ఓ బస్ షెల్టర్ లో అమ్మాయిలు, అబ్బాయిలు 'ల్యాప్ టాప్ నిరసన' (ఒకరి ఒళ్లో ఒకరు కూర్చోవడం) తెలిపారు. అసలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.... స్థానికులు తమపై ఆంక్షలు విధిస్తుండడమే కారణమని విద్యార్థులు అంటున్నారు. 

విద్యార్థుల సౌకర్యార్థం 'శ్రీకార్యం' వద్ద ఓ బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇది చాలా ఏళ్ల క్రితం నెలకొల్పారు. అయితే ఆ బస్ స్టాప్ లో అమ్మాయిలు, అబ్బాయిల ప్రవర్తన సరిగా లేదని ఆగ్రహంతో ఉన్న స్థానికులు... అక్కడ కూర్చునే పెద్ద బెంచీని మూడు ముక్కలుగా విడగొట్టారు. అంటే... ఒక్కో ముక్కపై ఒక్కొక్కరు మాత్రమే కూర్చునే విధంగా చేశారు. 

అయితే, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్థానికుల వైఖరిని వ్యతిరేకించారు. వారి తీరుకు నిరసనగా, ఆ ముక్కలపై ఓ విద్యార్థి కూర్చోగా, అతడి ఒళ్లో కొందరు విద్యార్థినులు కూర్చున్నారు. వారంతా భుజాలపై చేతులు వేసుకుని తమకు స్త్రీ, పురుష వివక్ష లేదని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు లింగ వివక్షను విడనాడాలని ఆ విద్యార్థులు హితవు పలికారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్థానికులపై తాము పోరాటం చేయడంలేదని, వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రమేనని నందన అనే విద్యార్థిని తెలిపారు.

More Telugu News