Jawahar: విజయసాయిరెడ్డి ముందే ట్వీట్ చేయడం అనుమానాలను కలిగిస్తోంది: జవహర్

  • చంద్రబాబు పర్యటన సందర్భంగా పడవ ప్రమాదం
  • ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న జవహర్
  • విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకు ఏమీ కాదని వ్యాఖ్య
Jawahar comments on Vijayasai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఉన్న పడవ బోల్తా కొట్టింది. దీంతో టీడీపీ నేతలు నీటిలోకి పడిపోయారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు మరో పడవలో ఉండటంతో ఆయనకు ఏమీ కాలేదు. 

మరోవైపు, ఈ ప్రమాదంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 'వెన్నుపోట్లతో అడ్డదారిలో రాజకీయ శిఖరాగ్రానికి చేరి, ఇప్పుడు బాధితుడిగా మారి, అక్కడి నుంచి జారి పడడమే జరగబోయే పరిణామం. కాలం మీ పాపాలను మరుగుపరిచినా... కర్మ వదలదు... అది వెంటాడుతూనే ఉంటుంది చంద్రబాబు' అని ట్వీట్ చేశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ... ఈ ప్రమాదం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. ప్రమాదానికి ముందే విజయసాయి ట్వీట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఆ ఘోరం జరుగుతుందని మీరు ముందే ఊహించారా? లేక ఉద్దేశపూర్వకంగా మీరే చేయించారా? అని ప్రశ్నించారు. కర్మపాపం ఏదైనా ఉంటే... అది పాపులకు లేదా జగన్ కు ఉంటుందని అన్నారు. 

అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబుకు జరిగిన రెండో ప్రమాదం ఇది అని జవహర్ అన్నారు. దేవుడు చంద్రబాబు పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏమీ కాలేదని చెప్పారు. విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకు ఏమీ కాదని అన్నారు. మొరగడం మానేసి వరద బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. చంద్రబాబును, టీడీపీ నేతలను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

More Telugu News