Monkeypox Virus: దేశంలో మూడో మంకీ పాక్స్ కేసు నమోదు.. ముగ్గురూ విదేశాల నుంచి వచ్చినవారే!

  • తొలి రెండింటితోపాటు మూడో పాజిటివ్ కేసు కూడా కేరళలోనే గుర్తింపు
  • ముగ్గురూ కూడా గల్ఫ్ దేశాల నుంచి వచ్చినవారే
  • బాధితుల ఆరోగ్యం బాగానే ఉందన్న కేరళ ఆరోగ్య మంత్రి 
Third monkeypox case confirmed in kerala

కొంతకాలంగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ మన దేశంలోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే రెండు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా.. తాజాగా మరో వ్యక్తికి కూడా మంకీ పాక్స్ సోకినట్టు గుర్తించారు. మొత్తం మూడు కేసులూ కూడా కేరళలోనే నమోదవడం గమనార్హం. మూడో కేసు నమోదైన వివరాలను కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చి..
ఈ నెల 6వ తేదీన యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల యువకుడికి మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. కేరళలోని మలప్పురం ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తికి ఇటీవల చర్మంపై దద్దుర్లు, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపగా.. మంకీ పాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో ఆ యువకుడిని ఉంచి చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. సదరు యువకుడితో కలిసి ఉన్న, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి ఐసోలేషన్ చేశామని.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

  • కేరళలో ఇంతకు ముందు బయటపడిన రెండు మంకీ పాక్స్ కేసులకు సంబంధించి బాధితులు విదేశాల నుంచి.. ముఖ్యంగా దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
  • మంకీ పాక్స్ వైరస్ సోకితే శరీరంపై భిన్నమైన దద్దుర్లు, తీవ్ర జ్వరం ఉంటాయి. సాధారణంగానే చాలా మంది దీని నుంచి కోలుకోగలరని.. కొందరిలో మాత్రం ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • మంకీ పాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కానీ సోకినవారికి బాగా సన్నిహితంగా మెలిగినా, తాకినా, వారి వస్తువులు, దుస్తులు ఉపయోగించినా.. వైరస్ సోకే అవకాశం ఉంటుంది.
  • మంకీ పాక్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది.
  • అయితే ఆఫ్రికాలోని కాంగోలో బయటపడిన మరో రకం మంకీ పాక్స్ వైరస్ మాత్రం ప్రమాదకరమని.. దానివల్ల 10 శాతం మేర మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.

More Telugu News