AAP: గుజరాత్​ లో ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్​.. బకాయిలూ మాఫీ: ఆప్​ గెలిస్తే అమలు చేస్తామన్న కేజ్రీవాల్​

  • ఉచితమని చెప్పి ఎలాంటి కోతలూ పెట్టబోమని వెల్లడి
  • నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ
  • మాట నిలబెట్టుకోకుంటే తర్వాతి ఎన్నికల్లో ఆప్‌ కు ఓటు వేయవద్దన్న కేజ్రీవాల్‌
  • గుజరాత్‌ లో గెలిస్తే ఏమేం చేస్తామనే ఎజెండా విడుదల
if AAP wins 300 units of free electricity per month for houses in Gujarat says Kejriwal

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని గృహ వినియోగదారులందరికీ నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. గుజరాత్‌ లోని సూరత్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

ఉచితంగా కరెంటు ఇవ్వడమే కాకుండా 2021 డిసెంబర్‌ 31 నాటికి ఉన్న పాత విద్యుత్‌ బకాయిలన్నీ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఉచితంగా ఇస్తున్నాం కదా అని ఎలాంటి కోతలు పెట్టబోమని.. వ్యాపార, వాణిజ్య వినియోగదారులతో పాటు గృహాలకు కూడా నిరంతరాయ విద్యుత్‌ ను అందిస్తామని ప్రకటించారు.

ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు..
గుజరాత్‌ లో ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇటీవలే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విజయం ఊపులో ఉన్న ఆప్‌ ను గుజరాత్‌ కూ విస్తరించాలని కేజ్రీవాల్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ లో వారం వారం పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూరత్‌ లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.

‘‘ఉచిత కరెంటు, నిరంతరాయ సరఫరాకు నేను గ్యారెంటీ. ఆప్‌ అధికారంలోకి రాగానే మేం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతాం. ఈ విషయంలో మేం ఎలాంటి తప్పిదం చేసినా.. ఆ తర్వాతి ఎన్నికల్లో ఆప్‌ కు ఓటు వేయకండి..’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాము గుజరాత్‌ లో అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్న వివరాలతో ఎజెండాను కూడా ప్రకటించారు.

More Telugu News