Chennai: పెళ్లికి అంగీకరించని 15 ఏళ్ల బాలిక.. హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన 19 ఏళ్ల యువకుడు

  • చెన్నైలోని తాంబరంలో ఘటన
  • విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో సబర్బన్ రైళ్ల సర్వీసులకు అంతరాయం
  • ఎవరు చెప్పినా వినని యువకుడు
  •  పెళ్లి చేసుకుంటానని బాలిక హామీ ఇవ్వడంతో దిగొచ్చిన యువకుడు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
Youth climbs on top of high tension electricity tower after his 15 year old partner refuses to marry him

15 ఏళ్ల బాలిక తనతో పెళ్లికి నిరాకరించడంతో 19 ఏళ్ల యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకెక్కి బెంబేలెత్తించాడు. చెన్నైలోని తాంబరం శానిటోరియం ప్రాంతంలో జరిగిందీ ఘటన. యువకుడు చేసిన పనితో సబర్బన్ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. టవర్ ఎక్కిన యువకుడిని క్రోంపేటలోని రాధానగర్‌కు చెందిన కృష్ణగా గుర్తించారు. హౌస్ పెయింటర్ అయిన అతడు 11వ తరగతి చదువుతున్న బాలికతో డేటింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు పెళ్లి చేసుకుందామని బాలిక వద్ద ప్రతిపాదన తీసుకురాగా, అందుకామె నిరాకరించింది.

ఆమెను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇక లాభం లేదని దుర్గానగర్‌లో ఉన్న 80 అడుగుల ఎత్తైన హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి అతడితో చర్చలు జరిపారు. పోలీసులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పినప్పటికీ కిందికి దిగేందుకు అతడు నిరాకరించాడు. చివరికి అతడు ప్రేమించిన బాలికను అక్కడికి తీసుకొచ్చారు. ఆమె పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కృష్ణ కిందికి దిగొచ్చాడు. అతడు కిందికి దిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News