Bandi Sanjay: గవర్నర్ తమిళిసై వరద ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించగానే.. సీఎం కేసీఆర్ ఉలిక్కి పడ్డారు: బండి సంజయ్

  • గవర్నర్ పర్యటన తర్వాతే సీఎం ఏరియల్ సర్వేకు వెళ్తున్నారని విమర్శ
  • ఇలాంటి ఆపద సమయంలోనూ కేసీఆర్ కేంద్రంపై బురదచల్లే రాజకీయాలు చేస్తున్నారన్న సంజయ్
  • మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్లారని ఆరోపణ 
Bandi Sanjay Hits Out CM KCR Over Negligence in Flood relief action

తెలంగాణలో భారీ వర్షాల వల్ల వందలాది గ్రామాలు నీట మునిగి,  లక్షలాది మంది నిరాశ్రయులైతే, వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలపైనే దృష్టి పెట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇలాంటి సమయంలోనూ ఎంపీలతో సమావేశం పేరుతో కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయడం కేసీఆర్‌ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. 

వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించగానే సీఎం కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారని ఎద్దేవా చేశారు. గవర్నర్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించిన తర్వాతే సీఎం ఏరియల్‌ సర్వేకు బయల్దేరారని విమర్శించారు. 

రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులకు జీతాలెందుకు సక్రమంగా ఇవ్వడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్‌ చేశారు. ఇక, ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ ప్రకటనలు చేయడం ఓ వింత అని  సంజయ్ ఎద్దేవా చేశారు. రూ.390 కోట్ల మిగులు బడ్జెట్‌తో  ఏర్పడ్డ రాష్ట్రం కేసీఆర్‌ పాలనలో రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్‌కు దిగజారిందని సంజయ్ ఆరోపించారు.

More Telugu News