Nizamabad District: గొంతుకోసి పారిపోయిన ప్రియుడు.. రాత్రంతా రోడ్డు పక్కన వర్షంలో తడుస్తూ నరకయాతన అనుభవించిన యువతి

  • నిజామాబాద్ జిల్లాలో దారుణం
  • పెళ్లికి నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయిన యువకుడు
  • గొంతు నులిమి ఆపై గాజు సీసాతో గొంతు కోసి పరారీ
Lover slit girls throat in nizamabad

తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. యువతి గొంతు కోశాడు. తీవ్రగాయాలపాలైన యువతి రక్తపు మడుగులో దాదాపు పది గంటలపాటు నరకయాతన అనుభవించింది. నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి.. మక్లూర్ మండలం మానిక్‌భండార్ గ్రామానికి చెందిన సంజయ్ (21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతిపై ఇటీవల అనుమానం పెంచుకున్న సంజయ్ ఆమెను వేధించడమే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 14న తన బర్త్ డేకు రమ్మని పిలవడంతో వచ్చిన యువతిని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో చిన్నాపూర్ శివారుకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అందుకామె నిరాకరించడంతో గొంతు నులిమాడు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత గాజు సీసాతో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

యువతి తనతోపాటు సెల్‌‌ఫోన్ తీసుకుని రాకపోవడంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 
శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల వరకు వర్షంలో తడుస్తూనే ప్రాణాలు నిలుపుకుంది. ఉదయం అటుగా వెళ్తున్నవారు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News