Adivi Sesh: పాకిస్థాన్ సహా 14 దేశాల్లో దూసుకుపోతున్న అడివి శేష్ 'మేజర్'

  • మేజర్ ఉన్నికృష్ణన్ కథాంశంతో తెరకెక్కిన 'మేజర్' 
  • స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్
  • ఇతర దేశాల్లో కూడా వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన అడివి శేష్
Adivi Sesh Mojor movie trending in 14 countries

అడివి శేష్ ప్రధాన పాత్రను పోషించిన 'మేజర్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో, 26/11 ముంబై ఉగ్రదాడుల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలో సైతం దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. 

ఓటీటీలో ఈ చిత్రానికి మన దేశంలోనే కాకుండా 14 దేశాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పాకిస్థాన్ తో పాటు 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మూవీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో ఈ చిత్రం నిలిచింది. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, మలేషియా, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, ఖతార్, సింగపూర్, యూఏఈ దేశాల్లో ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఇండియా, నైజీరియా, మారిషస్ లో టాప్ 1 స్థానంలో ఉంది. 


ఈ సందర్భంగా అడివి శేష్ స్పందిస్తూ... తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తనతో పాటు టీమ్ సభ్యులందరూ ఎంతో గర్వపడే సమయం ఇది అని అన్నాడు. ఈ సినిమా తమకు ఎప్పటికీ ప్రత్యేకమేనని చెప్పాడు.

More Telugu News