TPCC President: ప్రభుత్వ ఉద్యోగులు జీతమో రామ ‘చంద్ర’ అంటున్నారు: రేవంత్ రెడ్డి

  • సగానికిపైగా జిల్లాల్లో ఉద్యోగులకు  ఇంకా  జీతాలు అందలేదన్న పీసీసీ చీఫ్
  • రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శ
  • వంతుల వారీగా జీతాలు ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ లేదన్న రేవంత్
TPCC Chief slams CM KCR over delay in employees salary

సగం నెల కావొస్తున్నా తెలంగాణలోని పలు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు జీతమో రామ‘చంద్రా’ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

 ‘సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవ్. వంతులవారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడూ లేదు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అని రేవంత్ ట్వీట్ చేశారు. పలు జిల్లాల ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంపై ఓ పత్రికలో వచ్చిన వార్తను రేవంత్ షేర్ చేశారు.

రాష్ట్రంలోని 18 జిల్లాలో ఉద్యోగులకు జీతాలు అందలేదని తెలుస్తోంది. పెన్షనర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. సమయానికి జీతాలు రాకపోవడంతో  ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, దాంతో, చెక్ బౌన్సులు అవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, మరో 14 జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే దశల వారీగా జీతాలు వచ్చాయని, రోజుకు మూడు, నాలుగు జిల్లాలకు ఆర్థిక శాఖ చెల్లింపులు జరుపుతోందని సమాచారం.

More Telugu News