Pakistan: పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 147 మంది మృత్యువాత

  • పాకిస్థాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • చనిపోయిన వారిలో 88 మహిళలు, చిన్నారులు
  • వాతావరణ మార్పులే అధిక వర్షాలకు కారణమంటున్న నిపుణులు
heavy rains lashed pakistan 147 dead

పాకిస్థాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 147 మంది మృత్యువాత పడ్డారు. వర్షాల కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 88 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోర్ట్ సిటీ కరాచీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలా వరకు ప్రాంతాలు నీట మునిగాయి. 

వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయని, ఈ సమయంలో వాహనాల కంటే బోట్లే అవసరమని బాధితులు చెబుతున్నారు. నీట మునిగిన కార్లను రోడ్లపైనే వదిలేసినట్టు చెప్పారు. బెలూచిస్థాన్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 63 మంది వర్షాల కారణంగా మృతి చెందారు. సింధు ప్రావిన్స్ రాజధాని కరాచీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఇస్లామాబాద్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాతావరణ మార్పులే భారీ వర్షాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News