Revanth Reddy: నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయం చూశాం... దుర్యోధనుడు పూనినట్టుగా అనిపించింది: రేవంత్ రెడ్డి వ్యంగ్యం

  • బీజేపీ, మోదీపై తీవ్రస్థాయిలో కేసీఆర్ విమర్శలు
  • కేసీఆర్ అలా మాట్లాడడం కొత్తేమీ కాదన్న రేవంత్ 
  • మోదీకి ఆదర్శపురుషుడివి నువ్వే కదా అంటూ దెప్పిపొడుపు 
Revanth Reddy satires on CM KCR

నిన్న సీఎం కేసీఆర్ రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమయం ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీని, ప్రధాని మోదీని తూర్పారబట్టారు. దీనిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రమండలంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా నిలవాలన్నంత తాపత్రయం నిన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటల్లో కనిపించిందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

కేసీఆర్ నిన్న మాట్లాడిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తే కొత్తేమీ లేదు, వింతేమీ లేదని అన్నారు. అంతా ఊహించినదే అన్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే మాట్లాడినట్టుగా ఉందని తెలిపారు. మొత్తమ్మీద కేసీఆర్ ప్రసంగం చూస్తే దుర్యోధనుడు పూనినట్టుగా ఉందని, రెండున్నర గంటల పాటు ఏకపాత్రాభినయం చేసినట్టుగా ఉందని విమర్శించారు. 

"తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన వైనాన్ని ప్రపంచమంతా గుర్తించి, ఈయనకు భుజకీర్తులు తొడిగి, కిరీటము నగలు ఇచ్చి... సరిరారు ఈ ప్రభువుకు ఇంకెవ్వరూ అని చంద్రశేఖర్ రావు గారు తన గురించి తాను చాలా గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో సరిగా పాలించలేదు, సరైన నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూ, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని కేసీఆర్ చెప్పారు. మోదీ వివిధ రూపాల్లో దురాక్రమణలకు పాల్పడుతున్నారు... ఈ విధమైన ఆక్రమణలు మంచివా అని యువతను ప్రశ్నిస్తున్నాం.. మేలుకోండి, ఈ దేశాన్ని ఏలుకోండి అన్నట్టుగా ప్రసంగించారు. 

కేసీఆర్ మాట్లాడింది బాగానే ఉంది కానీ, మాట్లాడిన అంశాలతో ఆయనకేంటి సంబంధం అని అడుగుతున్నాం. మోదీ వివిధ పార్టీలను ఆక్రమిస్తూ, ప్రభుత్వాలను కూలగొడుతూ దురాక్రమణదారుగా కొనసాగుతున్నాడని నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆయనకు ఆదర్శపురుషుడివి నువ్వే కదా... ఆయన కులగురువు నువ్వే కదా. ఇట్లాంటి క్రూరమైన, నేరమయ ఆలోచనలకు మోదీకి నువ్వే ఆదర్శం కదా. 

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకున్నప్పుడు ఈ ఆక్రమణలు గుర్తుకు రాలేదా? తెలంగాణ ఏర్పడిన తర్వాత సబితా, ఎర్రబెల్లి వంటి ఏక్ నాథ్ షిండేలను తయారుచేసింది ఎవరు? విపక్షంలో గెలిచిన తలసాని శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లోకి పిలిచి మంత్రి పదవి ఇచ్చింది ఎవరు?" అంటూ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా ఇతర పార్టీల నేతలే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంద తప్పులు చేసిన కేసీఆర్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

More Telugu News