India: దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్​ ప్లాంట్​ తెలంగాణలో ఏర్పాటు.. ఎక్కడంటే

  • రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ లో ఏర్పాటు
  • 100 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం
  • రూ. 423 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ
Indias largest floating solar plant set up in Telangana

ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు ఆదరణ, డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా ఖాళీ ప్రదేశాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి పైకప్పు పై కూడా సౌర పలకలను ఏర్పాటు చేసి విద్యుత్ సృష్టించే వీలుంటుంది. కానీ, ఇప్పుడు నీటిపై తేలియాడే  సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అంటారు. భారత దేశంలోనే అతి పెద్దదైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను తెలంగాణలో తాజాగా ప్రారంభించారు.  

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్ లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ను ఎన్టీపీసీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తి  ప్రారంభించింది. తెలంగాణలోనే మొట్టమొదటగా నిర్మించిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రం.. దేశంలోనే అతి పెద్దదిగా రికార్డు కెక్కింది. కేరళలోని కాయంకుళంలో 80 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ప్లాంటును అధిగమించింది. 

500 ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీపీసీ రిజర్వాయర్ పై రూ. 423 కోట్లతో రెండేళ్ల క్రితం ఈ ప్లాంట్ పనులు ప్రారంభించారు. జులై 2021 నాటికి తొలి దశలో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, అక్టోబర్ నాటికి రెండు, మూడు దశల్లో పనులు పూర్తి చేసి 65 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టిన యాజమాన్యం తాజాగా నాలుగో, చివరి దశను పూర్తి చేయడంతో నిర్దేశిత 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యం అందుకుంది.

More Telugu News