Women: మహిళల్లో పెరుగుతున్న గుండె జబ్బులు.. కారణాలు ఏమిటంటే...!

  • మెనోపాజ్ తర్వాతే ముప్పు
  • ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుదల
  • పెరుగుతున్న ట్రై గ్లిజరైడ్స్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్
  • క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలని వైద్యుల సూచన
Women must make heart health a priority heart attck risk

పురుషుల మాదిరే మహిళల్లోనూ గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ పురుషులకే గుండె జబ్బుల రిస్క్ ఎక్కువన్న నమ్మకం ఉండేది. ఇప్పుడది నిజం కాదని తేలింది. భారత్ లో మహిళల మరణాల్లో గుండె జబ్బులే ప్రధాన కారణంగా ఉంటున్నట్టు, ముఖ్యంగా పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల మరణాల్లో 16.9 శాతం గుండె జబ్బుల వల్లేనని అంచనా. 

హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం.. పురుషుల లక్షణాలతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయి. మహిళలకు రుతుక్రమం నడిచినంత కాలం వారి గుండెకు రక్షణ ఉంటోంది. ఆ తర్వాతే వారికి ముప్పు మొదలవుతోంది. మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) రాక ముందు మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్.. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్  ను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ ను తగ్గిస్తూ వారి గుండెను కాపాడుతోంది. 

మెనోపాజ్ తర్వాత వారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో పురుషులతో పోలిస్తే మెనోపాజ్ మహిళల్లో టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు ట్రై గ్లిజరైడ్స్ పెరిగిపోవడం గుండె జబ్బులకు దారితీస్తోందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. 65 ఏళ్లు దాటిన మహిళలకు మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవడం, ట్రై గ్లిజరైడ్స్ పెరిగిపోవడం గుండె ముప్పును తెచ్చిపెడుతోంది. 

‘‘పురుషులతో పోలిస్తే మహిళల్లో మధుమేహం గుండెకు ఎక్కువగా హాని చేస్తోంది. ఎందుకంటే మహిళల్లో మధుమేహానికి స్థూలకాయం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ రిస్క్ తోడవుతోంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో పదేళ్లు ఆలస్యంగా గుండె సమస్యలు మొదలవుతాయి. కానీ, మధుమేహం ఈ అనుకూలతను కూడా చెరిపేస్తోంది’’ అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అంటోంది. 

మహిళల్లో గుండె జబ్బులు ఉన్న వారికి  మధుమేహం వస్తే మరింత ముప్పు పొంచి ఉన్నట్టేనని హెచ్చరిస్తోంది. మహిళలకు స్థూలకాయం, అధిక రక్తపోటు, గ్లూకోజ్ ఇంటోలరెన్స్, తక్కువ హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్, అధిక ట్రై గ్లిజరైడ్స్ చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ కు దారితీస్తున్న రిస్క్ అంశాలుగా పేర్కొంది. జీవక్రియల రుగ్మతలు ఎదుర్కొంటున్న వారికి ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. 

‘‘సాధారణంగా ఎక్కువ మంది మహిళలకు ఛాతీలో నొప్పి రాదు. ఇంటి బాధ్యతల వల్ల మహిళలు సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న లక్షణాలను పట్టించుకోరు. పురుషుల మాదిరే తమకూ గుండె జబ్బుల రిస్క్ ఉంటుందని మహిళలు తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకుంటూ, ఏవైనా ఆందోళనకర లక్షణాలు కనిపిస్తే సత్వరం వైద్యసాయం పొందాలి’’ అని కార్డియాలజిస్ట్ సంజీవ్ గెరా సూచించారు.

More Telugu News