Alluri Seetharama Raju: మోదీ ఆత్మీయ ప‌ల‌క‌రింపు, జ‌గ‌న్ ఆత్మీయ ఆలింగ‌నం!... భీమ‌వ‌రం టూర్‌పై చిరంజీవి ట్వీట్‌!

  • అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు చిరును ఆహ్వానించిన కేంద్రం
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌న్న చిరు
  • నాలుగు ఫొటోల‌తో ట్వీట్ చేసిన మెగాస్టార్‌
chiranjeevi tweet on alluri statue unveiling ceremony

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ నేడు ఏపీలోని భీమ‌వ‌రంలో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. భార‌త ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ... అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్రమానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌లు హాజ‌ర‌య్యారు. 

ఇక భీమ‌వ‌రం స‌మీపంలోని మొగ‌ల్తూరులో జ‌న్మించిన టాలీవుడ్ మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోల‌తో చిరు సోమ‌వారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. 

మొత్తం నాలుగు ఫొటోల‌ను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన చిరంజీవి... అల్లూరి విగ్ర‌హావిష్కర‌ణ‌కు కేంద్రం త‌న‌ను ఆహ్వానించ‌డం, ఆ కార్య‌క్ర‌మంలో తాను పాలుపంచుకోవడాన్ని త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక నాలుగు ఫొటోల్లో ఒకటి మోదీ త‌న‌ను ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తున్న ఫొటో కాగా... మ‌రొక‌టి జ‌గ‌న్ త‌న‌ను ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్న ఫొటోగా ఉంది. మ‌రో ఫొటోలో కూర్చున్న మోదీకి జ‌గ‌న్ చూస్తుండ‌గా చిరు న‌మ‌స్క‌రిస్తున్నారు. చివ‌రి ఫొటోగా వేదిక‌పై ఉన్న వారంతా నిల‌బ‌డిన‌దిగా ఉంది.

More Telugu News