Maharashtra: కుమారుల మృతిని త‌ల‌చుకుని అసెంబ్లీలోనే క‌న్నీరు పెట్టిన మ‌హారాష్ట్ర సీఎం షిండే... వీడియో ఇదిగో

  • బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే
  • శివ‌సేన ద్వారానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్న సీఎం
  • త‌న జీవితంలో విషాద ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్న షిండే
maharashtra cm eknath shinde remembers his sons death in assembly

మహారాష్ట్రకు నూత‌న సీఎంగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే... సోమ‌వారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల పరీక్ష‌లోనూ నెగ్గారు. ఈ సంద‌ర్భంగా త‌న జీవితంలోని ఓ విషాద ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్న ఆయ‌న క‌న్నీరు పెట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట మూగ‌బోతుండ‌గా... అంతలోనే త‌మాయించుకున్న ఆయ‌న.. ఆ విషాదం నుంచి త‌న‌ను శివ‌సేన నేత ఆనంద్ దిఘే బ‌య‌ట‌ప‌డేశార‌ని పేర్కొన్నారు. షిండేకు మొత్తం ముగ్గురు కుమారులు కాగా... త‌న స్వగ్రామంలో బోటు షికారుకు వెళ్లిన ఇద్ద‌రు కుమారులు బోటు తిర‌గ‌బ‌డటంతో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.

బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గిన షిండే... త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంపై అసెంబ్లీలో ఉద్వేగ ప్ర‌సంగం చేశారు. తాను శివ‌సేన ద్వారానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు. ఒకేసారి త‌న ఇద్ద‌రు కుమారులు మ‌ర‌ణించార‌ని... అదే త‌న జీవితంలో విషాద ఘటన అని ఆయ‌న తెలిపారు. ఆ బాధ నుంచి త‌న‌ను శివ‌సేన‌కు చెందిన ఆనంద్ దిఘే బ‌య‌ట‌ప‌డేశార‌ని షిండే చెప్పారు. వెర‌సి త‌న‌కు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశం క‌ల్పించ‌డంతో పాటు బాధ‌ల్లో ఉన్న త‌న‌ను ఆదుకున్న‌దీ శివ‌సేనేన‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News