wife: భార్యను కొట్టిన దుండగులపై కేసు పెట్టని పోలీసులు.. మృత శిశువుతో ఎస్పీ ఆఫీసుకు భర్త

  • ఆగ్రాలో ఆరు నెలల గర్బిణీపై ఇద్దరు వ్యక్తుల దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందిన పాప

ఆరు నెలల గర్భంతో ఉన్న తన భార్యను కొట్టిన దుండగులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృత శిశువుతో జిల్లా ఎస్పీ ఆఫీసుకు వచ్చి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. 
ఆగ్రాకు చెందిన  ధనిరామ్ భార్య ఆరు నెలల గర్భవతి. వీళ్లు పనికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేశారు.
దాంతో, ధనిరామ్ భార్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను సమీపంలోని నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడు ఆమెకు శస్త్రచికిత్స చేయగా పాప పుట్టింది. కానీ, పుట్టిన కొద్దిసేపటికే ఆ పాప మృతి చెందింది.

తన భార్యపై దాడి చేసి పాప మృతికి కారణమైన గుడ్డూ, రామస్వామ్‌ అనే ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు ధనిరామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అతని ఫిర్యాదును నమోదు చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో, తన నవజాత కుమార్తె మృతదేహంతో, స్థానికులతో కలిసి అతను జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. జరిగిన విషయం గురించి ఎస్పీకి మొర పెట్టుకున్నాడు. 

సీనియర్ ఎస్పీ ప్రభాకర్ చౌదరి ధనిరామ్‌కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై  తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఫతేహాబాద్ డీఎస్పీని ఆదేశించారు. కాగా, ధనిరామ్ భార్య ప్రస్తుతం ఆగ్రాలోని లేడీ లియాల్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

More Telugu News