Eknath Shinde: బల పరీక్షకు ముందు స్పీకర్ పోరు.. నేడు ముంబైకి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

  • ప్రభుత్వం తరఫున బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్..
  • మహా వికాస్ అగాధీ కూటమి నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వీ పోటీ
  • బల పరీక్షకు సిద్ధమవుతున్న ఏక్ నాథ్ షిండే సర్కారు
fight on Speaker post before floor test

మహారాష్ట్రలో రాజకీయం ఇంకా వేడి వేడిగానే కొనసాగుతోంది. బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇంకా స్పీకర్ ఎన్నిక, అసెంబ్లీలో బల పరీక్ష విషయంగా ఉత్కంఠ నెలకొంది. వీటి కోసం ఆదివారం నుంచే మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. సోమవారం బల పరీక్ష జరగనుంది. అంతకన్నా ముందు ఆదివారం స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.

స్పీకర్ ఎన్నికకు పోటీ..
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అసెంబ్లీకి నూతన స్పీకర్ ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అటు తిరుగుబాటు సర్కారుతోపాటు ఇటు శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధీ కూటమి కూడా పోటీ పడుతోంది. కొత్త ప్రభుత్వం తరఫున బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పోటీలో ఉండగా.. శివసేన కూటమి నుంచి ఎమ్మెల్యే రాజన్ సల్వీని బరిలోకి దింపారు. 

మహారాష్ట్రకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే సర్కారు సోమవారం బల పరీక్షను ఎదుర్కోనుంది. గోవాలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రానికల్లా ముంబైకి చేరుకోనున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఏక్ నాథ్ షిండే సహా కొందరు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వారు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయాలన్న శివసేన పిటిషన్ పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

More Telugu News