Botsa Satyanarayana: వైసీపీ నాయకుల్లో పక్క చూపు మొదలైంది.. దెబ్బతింటాం జాగ్రత్త: బొత్స

  • కార్యకర్తల్లో మనస్పర్థలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామన్న బొత్స
  • అధికారంలో ఉన్నా, లేకున్నా తమకేమీ కాదన్న మంత్రి
  • అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని ముందుకు సాగుదామని పిలుపు
Minister Botsa Satyanarayana Sensational comments

‘‘కార్యకర్తల్లో, నాయకుల్లో మనస్పర్థలు ఉంటే చర్చించుకుందాం. పరిష్కరించుకుందాం. అంతే తప్ప అభిప్రాయ భేదాలతో పార్టీని నాశనం చేయొద్దు. అధికారంలో ఉన్నా, లేకున్నా మాకేమీ కాదు. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో మీకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోండి’’ ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో నిన్న జరిగిన జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స.. పక్క చూపులు చూడొద్దన్నారు. ఒకవేళ అదే నిజమైతే అందరం నష్టపోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పనితీరు బాగుందని అందరూ చెబుతున్నారని, దానిని మనం నిలబెట్టుకోవాలని సూచించారు. పార్టీలో నెలకొన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి వంద రోజులకు ఒకసారి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తల కడుపులో ఉన్నవి బయటకు వస్తాయని, వారి సమస్యలను జిల్లా సమావేశం దృష్టికి తీసుకొస్తే లోటుపాట్లను సరిదిద్దుకుంటామని బొత్స పేర్కొన్నారు.

More Telugu News