England: టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే!

  • రేపటి నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • ఒకరోజు ముందుగానే జట్టును ప్రకటించిన ఈసీబీ
  • కివీస్ పై సిరీస్ గెలిచి ఊపుమీదున్న ఇంగ్లండ్
England team announced

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య గతంలో కరోనా కారణంగా జరగని ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయడం తెలిసిందే. ఈ టెస్టు రేపటి నుంచి బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ లో ఆడే ఇంగ్లండ్ తుదిజట్టును నేడు ప్రకటించారు. న్యూజిలాండ్ తో మూడో టెస్టుకు దూరమైన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ జట్టులోకి వచ్చాడు.

ఇక, రెగ్యులర్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కు కరోనా సోకడంతో కివీస్ తో మూడో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన శామ్ బిల్లింగ్స్ కు కూడా జట్టులో చోటు కల్పించారు. టీమిండియాతో టెస్టులో బిల్లింగ్సే వికెట్ కీపర్ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. న్యూజిలాండ్ తో సిరీస్ లో ఓ మోస్తరుగా రాణించిన అలెక్స్ లీస్, జాక్ క్రాలే ఓపెనర్లుగా తమ స్థానాలను నిలుపుకున్నారు. నిలకడగా ఆడుతున్న ఓలీ పోప్ మూడో స్థానంలోనే కొనసాగనున్నాడు. 

భీకర ఫామ్ లో ఉన్న జానీ బెయిర్ స్టో, జో రూట్ లకు తోడు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా రాణిస్తుండడంతో ఇంగ్లండ్ జట్టు అత్యంత బలోపేతంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో ప్రధానంగా జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ జోడీ గత కొంతకాలంగా కొత్తబంతిని పంచుకుంటోంది. టీమిండియాతో మ్యాచ్ లోనూ ఈ ద్వయం చెలరేగాలని ఇంగ్లండ్ అభిమానులు కోరుకుంటున్నారు. వీరికితోడు కొత్త కుర్రాడు మాథ్యూ పాట్స్ రాణిస్తుండడంతో ఇంగ్లండ్ శిబిరంలో మరింత ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. జట్టులో ఏకైక స్పిన్నర్ గా జాక్ లీచ్ కు అవకాశం కల్పించారు.

ఇంగ్లండ్ జట్టు...
బెన్ స్టోక్స్ (కెప్టెన్), అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.

More Telugu News