Vishal: కుప్పం బరిలోకి ‘పందెంకోడి’.. చంద్రబాబును ఓడించడమే లక్ష్యం?

  • కుప్పంలో తమిళ ప్రభావం కలిసొస్తుందన్న భావనలో వైసీపీ నేతలు
  • ఆయన కుటుంబానికి కుప్పంతో అనుబంధం
  • విశాల్ తండ్రి జీకే రెడ్డికి కుప్పం ప్రాంతంలో గ్రానైట్, పాలిషింగ్ యూనిట్లు
Is Actor Vishal Contest in Kuppam Against Chandrababu

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయనను ఢీకొట్ట గలిగే బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్న ఆ పార్టీ నేతలు కోలీవుడ్ నటుడు విశాల్‌ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విశాల్ తండ్రి జీకే రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా. కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. కుప్పం ప్రాంతంలో విశాల్‌కు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని విశాల్‌ను పోటీలో నిలపడం ద్వారా చంద్రబాబును దెబ్బకొట్టాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. 

ఈ మేరకు విశాల్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉండడం కూడా కలిసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాల్ మాత్రం సానుకూలంగా స్పందించలేదని సమాచారం. అయితే, పోటీ చేస్తే ఎలా ఉంటుందని స్నేహితులు, సన్నిహితుల వద్ద చర్చించినట్టు మాత్రం తెలుస్తోంది.

1989 నుంచీ కుప్పంలో చంద్రబాబుదే గెలుపు. ప్రత్యర్థులు ఎవరైనా బాబును ఎవరూ ఓడించలేకపోయారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేతకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబును ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది. చంద్రబాబుపై విశాల్ పోటీ ఖాయమన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే స్వయంగా విశాల్ స్పందించాల్సి ఉంటుంది.

More Telugu News