Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు

  • పాత్రా చాల్ భూకుంభకోణంలో సమన్లు
  • రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొన్న ఈడీ
  • ఇప్పటికే సంజయ్ రౌత్ భార్య ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ED summons Shiv Sena MP Sanjay Raut

ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న శివసేనకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ కు మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 1,034 కోట్ల పాత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించిన కేసులో సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం రేపు తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో ఆదేశించింది. 

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, మరో ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆ సందర్భంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, తాను భయపడే వ్యక్తిని కానని చెప్పారు. తన ఆస్తులను సీజ్ చేసినా, తనను షూట్ చేసినా, తనను జైలుకు పంపినా భయపడనని.. తాను బాలాసాహెబ్ థాకరే అనుచరుడినైన శివసైనికుడినని అన్నారు.  


మరోవైపు గత వారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ, శివసేనకు వ్యతిరేకంగా ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈడీ చేత ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా తాము ఉద్ధవ్ థాకరే వెంటే ఉంటామని చెప్పారు. ఈడీ ఒత్తిడికి లొంగి శివసేనను వదిలిపెట్టే వారంతా బాల్ థాకరే నిజమైన భక్తులు కాదని అన్నారు.

More Telugu News