Corona Virus: తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

  • మళ్లీ పుంజుకుంటున్న కరోనా
  • పెరుగుతున్న రోజువారీ కేసులు
  • గత 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు
  • 496 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 341 కొత్త కేసులు
Corona active cases number crosses three thousand mark in Telangana

తెలంగాణలో మరోసారి కరోనా వ్యాప్తి పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,98,621 మంది కరోనా బారినపడగా, వారిలో 7,90,897 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,613 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

More Telugu News