NIA: ఎన్​ఐఏ అదుపులో తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయవాది చుక్కా శిల్ప!

  • విశాఖలో నర్సింగ్ విద్యార్థి  అదృశ్యం కేసులో శిల్ప సహా హైదరాబాద్ లో పలువురి నివాసాల్లో సోదాలు
  • తమ కూతురిని నక్సలైట్లలో చేరేలా శిల్ప, మరికొందరు ప్రేరేపించారని తల్లి ఫిర్యాదు
  • చైతన్య మహిళా సంఘంలో సభ్యురాలిగా శిల్ప
NIA reportedly takes High Court woman advocate chukka shilpa into custody

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైదరాబాద్ సహా  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  సోదాలు నిర్వహిస్తోంది. ఉప్పల్‌ చిలుకానగర్‌లోని తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయవాది చుక్కా శిల్పతో పాటు మరికొందరి నివాసాల్లో  గురువారం ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

విశాఖపట్నంలో  ఓ  నర్సింగ్‌ విద్యార్థిని తప్పిపోయిన కేసు విషయంలో ఎన్ఐఏ శిల్పను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శిల్ప సీఐపీ (మావోయిస్టు) అనుబంధ సంస్థ అయిన చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌)లో సభుర్యాలిగా ఉన్నారు. పార్వతీపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్‌ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్‌ ఇంట్లో కూడా ఎన్ఐఏ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.

    విశాపట్నంలో మూడున్నరేళ్ల కిందట రాధ అనే నర్సింగ్ విద్యార్థిని అదృశ్యమైంది.  చైతన్య మహిళా సంఘం నాయకులు తన కూతురిని కిడ్నాప్‌ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీఎంఎస్‌ నాయకులు డొంగరి దేవేంద్ర, దుబాసి స్వప్న, న్యాయవాది శిల్ప తన కూతురిని కళాశాలలో కలిసి మావోయిస్టుల్లో చేరేలా ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2017 డిసెంబర్ లో  వైద్యం చేయిస్తామంటూ దేవేంద్ర తన కూతురును తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదని పోలీసులకు తెలిపారు.

    ఈ కేసును విశాఖ పోలీసులు  ఎన్‌ఐఏకు అప్పగించారు. దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అనుమానితుల ఇళ్లపై గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేసింది. మెదక్‌ జిల్లాలోని చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు  సోదా చేస్తున్నారు.

More Telugu News