Karanam Dharmasri: 1998 డీఎస్సీకి ఎంపికైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

  • 1998లో డీఎస్సీ రాసిన కరణం ధర్మశ్రీ
  • అప్పుడే ఉద్యోగం వచ్చి ఉంటే టీచర్‌గా స్థిరపడి ఉండేవాడినన్న ఎమ్మెల్యే
  • కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగు
Chodavaram MLA Karanam Dharmasri Selected for DSC

1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో ధర్మశ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 

తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలని గుర్తు చేసుకున్నారు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని, ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని పేర్కొన్నారు. 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ అభ్యసించడం మొదలుపెట్టినట్టు చెప్పారు.

ఆ సమయంలోనే కాంగ్రెస్‌లో చేరి పార్టీ జిల్లా యువజన విభాగంలో పనిచేసినట్టు చెప్పారు. అప్పుడే కనుక తనకు ఉద్యోగం వచ్చి ఉంటే ఉపాధ్యాయుడిగా స్థిరపడి ఉండేవాడినని అన్నారు. డీఎస్సీ 1998 బ్యాచ్ తరపున సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.

More Telugu News