Congress: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ రేపు ఢిల్లీకి రండి... కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఏఐసీసీ పిలుపు

  • ఇప్ప‌టికే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
  • నాలుగు రోజులుగా రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ
  • సోమ‌వారం ఆసుప‌త్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జీ
  • సోనియా గాంధీని కూడా ఈడీ విచారించే అవ‌కాశం
aicc asked its mlas and mlcs to come to delhi by tuesday

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం (ఏఐసీసీ) సోమ‌వారం రాత్రి అన్ని రాష్ట్రాల్లోని త‌న ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఓ కీల‌క పిలుపు నిచ్చింది. మంగ‌ళ‌వారం ప్ర‌జా ప్ర‌తినిధులంతా ఢిల్లీకి రావాల‌ని ఏఐసీసీ స‌ద‌రు పిలుపులో పేర్కొంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి రావాల‌ని కోరింది. ఇప్ప‌టికే పార్టీకి చెందిన ఎంపీలంతా ఢిల్లీలోనే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా కాంగ్రెస్ అగ్ర నేత‌ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచారిస్తున్న వైనాన్ని నిర‌సిస్తూ పార్టీ ఎంపీలు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

తాజాగా సోమ‌వారం సాయంత్రం ఆసుప‌త్రి నుంచి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డిశ్చార్జీ అయ్యారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో విచార‌ణ కోసం ఈ నెల 23న త‌మ ముందు హాజ‌రు కావాల‌ని సోనియాకు ఈడీ ఇప్ప‌టికే స‌మ‌న్లు జారీ చేసింది. ఇదే కేసులో ఇప్ప‌టికే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. తాజాగా సోనియాను కూడా ఈడీ విచారించే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులంతా ఢిల్లీకి రావాల‌ని ఏఐసీసీ పిలుపు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఢిల్లీలోనే మ‌కాం వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీసీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌లు కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న ఆందోళ‌న‌ల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. తాజాగా ఏఐసీసీ పిలుపుతో తెలంగాణ‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగ‌ళ‌వారం ఉద‌యానిక‌ల్లా ఢిల్లీలో ఉండాలంటూ వారికి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క స్వ‌యంగా ఫోన్ చేసి చెప్పారు.

More Telugu News