Peddireddi Ramachandra Reddy: సొంత నిధులతో వకుళమాత ఆలయాన్ని నిర్మించిన మంత్రి పెద్దిరెడ్డి... ప్రారంభోత్సవానికి సీఎం జగన్ కు ఆహ్వానం

  • తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో వకుళమాత ఆలయం
  • పేరూరు బండపై కొలువుదీరిన అమ్మవారు
  • ఈ నెల 23న ప్రారంభోత్సవం
  • సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందించిన పెద్దిరెడ్డి 
Minister Peddireddy invites CM Jagan to inaugurate Vakula Matha Temple

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతికి సమీపంలో వకుళమాత ఆలయాన్ని నిర్మించారు. పేరూరు బండపై ఈ ఆలయం కొలువుదీరింది. ఈ ఆలయ నిర్మాణం కోసం మంత్రి పెద్దిరెడ్డి సొంత నిధులు వెచ్చించారు. తిరుమల వెంకన్న ఆలయం, బెజవాడ దుర్గమ్మ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిని కలిగివున్న ఆలయం ఇదొక్కటే. కాగా, ఈ ఆలయాన్ని ఈ నెల 23న ప్రారంభించనున్నారు. 

ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వేదమంత్రోచ్చారణ మధ్య ఆహ్వానపత్రిక అందజేశారు. టీటీడీ వేదపండితులు తిరుమల శ్రీవారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి సీఎంకు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని సీఎంకు వివరించారు. ఈ నెల 18న అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. 

పేరూరు వకుళమాత క్షేత్రం ఇప్పటిది కాదు.  320 ఏళ్ల కిందట మైసూర్ పాలకుడు హైదర్ అలీ దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం కూడా మాయమైంది. అయితే, ఇన్నాళ్ల తర్వాత వకుళమాత ఆలయం మంత్రి పెద్దిరెడ్డి కారణంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఆయన వకుళమాత ఆలయాన్ని పునరుద్ధరించారు.

More Telugu News