Neeraj chopra: భారత బల్లెం వీరుడు నీరజ్​ బంగారు పతకం గెలిచాడు.. అది కూడా తొలి ప్రయత్నంలోనే​

  • మూడో ప్రయత్నంలో కిందపడిపోయిన నీరజ్
  • చివరి మూడు త్రో లకు దూరం
  • ఆరు ప్రయత్నాల్లోనూ చోప్రాను అందుకోలేకపోయిన పోటీదారులు
India star Javelin thrower neeraj chopra wins gold at kuortane games

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాది మొదటి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫిన్లాండ్‌‌‌‌లో జరుగుతున్న కౌర్టెన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో అతను స్వర్ణం సాధించాడు. శనివారం జరిగిన పోటీల్లో నీరజ్‌‌‌ తన బల్లెంను అందరికంటే ఎక్కువగా 86.96 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ కు ఇదే మొదటి స్వర్ణం. 
    
ఈ పోటీల్లో నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే విసిరిన త్రో తోనే బంగారు పతకం అందుకోవడం విశేషం. సాధారణంగా జావెలిన్ త్రోలో ఒక్కో క్రీడాకారుడు ఆరుసార్లు బల్లెంను విసరవచ్చు. కానీ, ఈ పోటీల సమయంలో వర్షం వల్ల మైదానం తడిగా మారింది. నీరజ్ రెండో ప్రయత్నంలో లైన్ దాటి ఫౌల్ చేశాడు. మూడో త్రో చేస్తున్నప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతనికి గాయాలేమీ కాలేదు. చివరి మూడు త్రోలకు నీరజ్ దూరంగా ఉన్నాడు. 

 మిగతా పోటీదారులు ఆరు ప్రయత్నాలు చేసినా భారత క్రీడాకారుడికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. కెషర్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) 86.64 మీటర్ల దూరంతో రజతం నెగ్గగా, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 84.75 మీటర్ల దూరంతో కాంస్యం సాధించాడు. నీరజ్ ఈ వారంలో ఫిన్లాండ్లోనే జరిగిన పావో నరుమి గేమ్స్‌‌‌‌లో 89.30 మీటర్ల దూరంతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ రజతం గెలిచాడు.

More Telugu News