Botsa Satyanarayana: రాజకీయాల్లో చంద్రబాబు అంత పనికిమాలిన నేత మరొకరు లేరు: బొత్స

  • ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన
  • బొత్సపై విమర్శలు గుప్పించిన బాబు 
  • చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మబోరని వెల్లడి
  • ప్రభుత్వ పాఠశాలలు మూసివేసింది చంద్రబాబేనని ఆరోపణ 
Botsa slams Chandrababu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తమపై విమర్శలు చేస్తుండడం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో స్పందించారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.  బొబ్బిలి ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజుకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకుని... వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చిన నువ్వా మా జిల్లాకు వెళ్లి సామాజిక న్యాయం గురించి మాట్లాడేది? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

జ్ఞాపకశక్తి నశించిన చంద్రబాబు సహనం కోల్పోయి పనికిమాలిన భాష, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బొత్స విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు అంత పనికిమాలిన నేత మరొకరు లేరని వ్యాఖ్యానించారు. ఓ పనికిమాలిన వాడిలా తయారైన చంద్రబాబు తప్పుడు విమర్శలకే పరిమితమవుతున్నారని వెల్లడించారు. అసలు, చంద్రబాబు మాటలను ప్రజలెవరూ నమ్మబోవడంలేదని అన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలు మూసివేసింది చంద్రబాబేనని ఆరోపించారు. విశాఖ అభివృద్ధి నాడు వైఎస్సార్ హయాంలోనే జరిగిందని బొత్స స్పష్టం చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, ఆ అనుభవం నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని హితవు పలికారు.

More Telugu News