KTR: కాంగ్రెస్ పార్టీ పనైపోయింది... రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తుంటే అడిగే దిక్కులేదు: కేటీఆర్

  • మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ లో కేటీఆర్ వ్యాఖ్యలు
  • రాహుల్ గాంధీపైనా, కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు
  • కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని వెల్లడి
  • చరిత్ర మాత్రమే మిగిలిందని ఎద్దేవా
  • ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావడంలేదని వ్యాఖ్యలు
KTR fires on Congress Party

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని అంటున్నాడని, ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రైతుల రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడని వెల్లడించారు. 

"కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు చాన్స్ లు ఇవ్వలేదా? కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు, తెలంగాణ ప్రజలు పది చాన్స్ లు ఇచ్చారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్ల పాటు పాలించింది వారే. ఈ రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ... ఇలా ఐదు తరాల పాటు కాంగ్రెస్ పార్టీకి బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణ అధికారాన్ని అప్పగించింది. కానీ రాహుల్ గాంధీ మళ్లా వచ్చి ఒక్క చాన్స్ అంటున్నాడు. 

50 ఏళ్లు అధికారం ఇస్తే కరెంటు ఇవ్వక చావగొట్టింది నువ్వు కాదా? మంచినీళ్లు ఇవ్వకుండా చావగొట్టింది నువ్వు కాదా? సాగునీరు ఇవ్వకుండా చావగొట్టింది నువ్వు కదా? పెన్షన్లు ఇవ్వక సతాయించింది నువ్వు కాదా? సరైన విద్యనందించక సతాయించింది నువ్వు కాదా? సోమశిల మీద బ్రిడ్జి కట్టక సతాయించింది నువ్వు కాదా? 50 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది ఎవరు... నువ్వు, నీ పార్టీ కాదా? మళ్లా ఇవాళ నువ్వు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతుంటే, తల్లిదండ్రులను చంపినవాడే వచ్చి నేను అనాథనయ్యా వదిలిపెట్టండి అని చెప్పినట్టుగా ఉంది. 

కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాట మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలం చెల్లిన మందు లాంటిది. భూమి పుట్టినప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తప్ప ఎక్కడా వాళ్లకు భవిష్యత్తు లేదు. ఇంకే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతవుతున్నాయి. 

రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నా అడిగేవాడేలేడు. ఎక్కడా చడీచప్పుడులేదు. అట్లాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, పాడె మీద పీనుగులా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్ధరిస్తుంది అంటే ఎట్లా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? గత అనుభవాలు లేవా? ప్రజలు దీనిపై ఒక్కసారి ఆలోచించాలి" అంటూ కేటీఆర్ ప్రసంగించారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News