vijay shanthi: సమగ్ర అవగాహనతో, సామాజిక స్పృహతో స్పందించాలి: సాయి పల్లవికి విజయశాంతి సూచన

  • అవగాహన లేని విషయాలను పక్కన పెట్టడం మంచిదన్న విజయశాంతి 
  • మనం మాట్లాడే ప్రతీ మాట కోట్లాది మందికి చేరిపోతుందని వ్యాఖ్య 
  • సామాజిక స్పృహతో స్పందించాలంటూ కామెంట్
vijay shanthi responded on sai pallavi kashmiri pandits comments

వర్ధమాన నటి సాయి పల్లవి కశ్మీరీ పండిట్లపై హింసాకాండను.. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ముస్లింపై గో సంరక్షుల దాడిని ఒకే గాటన కడుతూ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. దీనిపై బీజేపీ నేత, మాజీ నటి విజయశాంతి స్పందిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. 

‘‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవ సమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. 

డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.. తప్పు చేసిన పిల్ల వాడిని తల్లి దండించడం ఏ విధంగా ఒకటవుతాయి? ఆ దోపిడీ దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.

నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతూ.... ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో... సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి’’ అంటూ తన పోస్ట్ లో విజయశాంతి పేర్కొన్నారు.

More Telugu News