Nimmala Rama Naidu: టీడీపీ ఎమ్మెల్యేను ప‌రామ‌ర్శించిన మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు

  • ఇటీవ‌లే వైసీపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సుబ్బారాయుడు
  • రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ మాజీ మంత్రి
  • టీడీపీతో అనుబంధం నేప‌థ్యంలోనే రామా నాయుడుకు ప‌రామ‌ర్శ‌
kottapalli subbarayudu visits tdp mla nimmala rama naidu

ఏపీకి చెందిన మాజీ మంత్రి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు బుధ‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడును ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌లే అనారోగ్యానికి గురైన రామా నాయుడు త‌న ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆయ‌నను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు బుధ‌వారం నేరుగా పాల‌కొల్లు వెళ్లి, రామానాయుడును ప‌రామ‌ర్శించారు. ఈ విష‌యాన్ని రామానాయుడు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు.

టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన సుబ్బారాయుడు... ఆ పార్టీలోనే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మ‌డి ఏపీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో చేరిన సుబ్బారాయుడు... మొన్న‌టిదాకా వైసీపీలో కొన‌సాగారు. 2024 ఎన్నిక‌ల్లో తాను త‌ప్ప‌నిస‌రిగా న‌ర‌సాపురం నుంచే పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తాన‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌న‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన వైసీపీ అధిష్ఠానం ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.

ప్ర‌స్తుతం ఏ పార్టీతో సంబంధం లేకుండానే సాగుతున్న సుబ్బారాయుడు... త్వ‌ర‌లోనే ఏదో ఒక పార్టీలో చేరే దిశ‌గా క‌దులుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న సొంత జిల్లాకు చెందిన నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. 

More Telugu News