YSRCP: 'కర్మ' అంటూ రాహుల్ గాంధీపై విజయసాయిరెడ్డి సెటైర్లు... వైసీపీ ఎంపీపై నెటిజన్ల విమర్శలు

  • జ‌నానికి రాహుల్ ముఖం చూపించ‌లేక‌పోతున్నార‌న్న విజయసాయి  
  • 2024 ఎన్నిక‌ల త‌ర్వాత పీపీఈ కిట్ అవ‌స‌ర‌మేమోనంటూ ఎద్దేవా
  • మీకే డ‌జన్ పీపీఈ కిట్లు అవ‌స‌ర‌మంటూ సాయిరెడ్డికి నెటిజ‌న్ చుర‌క‌
netizens trolls ysrcp mp vijay sai reddy after he post a tweet on rahul gandhi

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు సోమ‌వారం హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రి ప్రియాంకా గాంధీ తోడు రాగా ఈడీ ఆఫీస్‌కు బ‌య‌లుదేరిన రాహుల్ గాంధీ ఫొటోను జ‌త చేస్తూ వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సోమ‌వారం రాత్రి ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 

క‌ర్మ ఫ‌లం ఎక్క‌డికి పోతుంది అన్న‌ట్లుగా అర్థం వ‌చ్చేలా సాగిన ఆ పోస్టులో... ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత జ‌నానికి రాహుల్ గాంధీ ముఖం చూపించ‌లేక‌పోతున్నార‌ని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు జ‌నంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవ‌స‌ర‌మ‌వుతుందేమోనంటూ మ‌రో కామెంట్ చేశారు.

ఈ ట్వీట్‌ను చూసినంత‌నే నెటిజ‌న్లు సాయిరెడ్డిపై ట్రోలింగ్ మొద‌లెట్టారు. ఏ అర్హ‌త ఉంద‌ని రాహుల్ గాంధీని ఇలా విమ‌ర్శిస్తున్నార‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నిస్తే... ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ర‌దాల మాటున ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు క‌దా అంటూ మ‌రో నెటిజ‌న్ దెప్పి పొడిచారు. 'ఎందుకైనా మంచిది, మీరు ఓ డ‌జ‌న్ పీపీఈ కిట్లు ద‌గ్గ‌ర పెట్టుకోండి' అంటూ ఆ నెటిజ‌న్ సాయిరెడ్డిపై పంచ్ సంధించారు. రాహుల్ గాంధీని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నార‌న్న మ‌రో నెటిజ‌న్ సాయిరెడ్డికి త్వ‌ర‌లోనే త‌న త‌ప్పేంటో తెలుస్తుందంటూ పేర్కొన్నారు.

More Telugu News