Sensex: స్టాక్ మార్కెట్లలో అమ్మకాల మంటలు.. సెన్సెక్స్ 1500 పాయింట్ల పతనం

  • అమెరికాలో ఎగసిన ద్రవ్యోల్బణం
  • 40 ఏళ్ల గరిష్ఠ స్థాయి 8.6 శాతానికి చేరిక
  • ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు
  • చైనాలో వృద్ధి మందగమన ఆందోళనలు
  • ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు
Sensex crashes over 1500 pts on global selloff

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు షాక్ తగిలేలా చేసింది. ఫెడ్ వడ్డీ రేట్లను మరింత వేగంగా పెంచుతుందన్న అంచనాలు, అనిశ్చితుల నడుమ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలకు మొగ్గు చూపించారు. అమెరికాలో మే నెల ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదైంది. 

మరోవైపు చైనాలో అత్యధిక జనాభా ఉండే చాయాంగ్ లో కరోనా కేసులు గణనీయంగా వెలుగు చూడడం ఆందోళనలను మరింత పెంచిందని చెప్పుకోవాలి. మూడు విడతలుగా పరీక్షలకు అక్కడి సర్కారు ఆదేశించింది. లాక్ డౌన్ లతో వృద్ధి కుంటుపడుతుందన్న భయాలు కూడా తోడయ్యాయి. ఆసియా వ్యాప్తంగా ఈక్వీటీ మార్కెట్లు 2 శాతానికి పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ సోమవారం ఇంట్రాడేలో 1.3 శాతం నష్టాన్ని చూస్తోంది. 

ఈ ప్రతికూలతలు మన ఈక్విటీ మార్కెట్లను బలంగానే తాకాయని చెప్పుకోవాలి. సెన్సెక్స్ 52,734 వరకు పడిపోయింది. ప్రస్తుతం 1400 పాయింట్ల నష్టంతో (2.58 శాతం) 52,900 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. 15,752 వరకు పడిపోయిన నిఫ్టీ 50 సైతం ప్రస్తుతం 408 పాయింట్ల నష్టంతో (2.50 శాతం) 15,796 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 50లో 49 షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నష్టాలతో దేశీ స్టాక్స్ విలువ మొత్తం మీద ఇంట్రాడేలో రూ.6 లక్షల కోట్ల మేర ఆవిరి అయిపోయింది. 

బజాజ్ ట్విన్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ మూడు శాతానికి పైగా నష్టాలను చూస్తున్నాయి. బీఎస్ఈలో మొత్తం 168 స్టాక్స్ ఇంట్రాడేలో అనుమతించిన కనిష్ఠ స్థాయిలో (లోయర్ సర్క్యూట్) ఫ్రీజ్ అయ్యాయి. అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడులు బంగారం, డెట్ వంటి రిస్క్ లేని సాధనాల్లోకి వెళుతుంటాయి.

More Telugu News