Kurnool District: వివాహమైన మూడ్రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన యువతి.. ఆగ్రహంతో ప్రియుడి ఇంటికి నిప్పు!

  • కర్నూలు జిల్లా మాధవరంలో ఘటన
  • పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించిన యువతి
  • ప్రియుడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
newly married girl elope with lover in kurnool dist

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేని ఓ యువతి పెళ్లయిన మూడో రోజే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె కుటుంబ సభ్యులు సదరు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యువతికి పొరుగూరుకు చెందిన యువకుడితో ఈ నెల 9న వివాహమైంది. అయితే, మాధవరానికి చెందిన యువకుడు శివాజీతో ఆమె అప్పటికే ప్రేమలో ఉంది. పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించినప్పటికీ శివాజీని మర్చిపోలేకపోయింది.

దీంతో పెళ్లయిన మూడో రోజే శివాజీతో కలిసి వెళ్లిపోయింది. విషయం తెలిసిన యువతి బంధువులు గత రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పు పెట్టారు. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వస్తు సామగ్రి మాత్రం కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలు అదుపు చేశారు. శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News