IPL media rigths: ఐపీఎల్ మీడియా హక్కులు రూ.77వేల కోట్లు అంటున్న లలిత్ మోదీ

  • బరిలో స్టార్ ఇండియా, సోనీ, రిలయన్స్ వయాకామ్
  • ప్యాకేజీ ఏ, బీకి వేలం ఆరంభం
  • పూర్తిగా ఆన్ లైన్ లోనే నిర్వహణ
  • రిజర్వ్ ధర రూ.32,000 కోట్లు
USD 10 billion for IPL media rigths Lalit Modi makes bold claim

ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం పోటీ నేడు మొదలైంది. అమెజాన్ ముందే పోటీ నుంచి తప్పుకుంది. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. స్టార్ ఇండియా, సోనీ, రిలయన్స్ వయాకామ్ జాయింట్ పోటీ పడుతున్నాయి. 

టీవీ ప్రసార హక్కులకు ఉద్దేశించిన ప్యాకేజీ ఏ, ప్యాకేజీ బీకి వేలం మొదలైంది. వేలం ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే జరగనుంది. ఇప్పటి వరకు ఈ మొత్తం హక్కులు స్టార్ ఇండియాకే ఉన్నాయి. వచ్చే ఐపీఎల్ నుంచి ఐదేళ్ల కోసం వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసార హక్కులను ఎలాగైనా దక్కించుకోవాలన్నది స్టార్ యోచన.

మొత్తం నాలుగు ప్యాకేజీలుగా వేరు చేసి ప్రసార హక్కులను వేలం వేస్తున్నారు. ప్యాకేజీ ఏ గెలిచిన వారు.. ప్యాకేజీ బీ కూడా సొంతం చేసుకునే హక్కును కలిగి ఉంటారు. కాకపోతే ప్యాకేజీ బీ కోసం వచ్చిన బిడ్ పై 5 శాతం అధిక ధర చెల్లించాలి. ఒకవేళ అంత చెల్లించడం ఇష్టం లేకపోయినా, ప్యాకేజీ బీ హక్కుల పట్ల ఆసక్తి లేకపోయినా.. అప్పుడు ప్యాకేజీ బీని అత్యధిక బిడ్డర్ కు కేటాయిస్తారు. అంతేకాదు ప్యాకేజీ బీ గెలుచుకున్న వారు ప్యాకేజీ సీకి అధిక బిడ్ వేసి సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐపీఎల్ ప్రసార హక్కులకు బీసీసీఐ రూ.32,000 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. కానీ, రూ.40-50వేల కోట్ల వరకు రావచ్చని అంచనా  వేస్తున్నారు. అయితే ఐపీఎల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లలిత్ మోదీ మాత్రం బీసీసీఐకి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదాయన్ని తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. తొలుత తాము అన్వేషించిన డిజిటల్ విభాగం ఇప్పుడు అసలు రూపం దాలుస్తున్నట్టు చెప్పారు. జీవితాన్ని మొబైల్ ఫోన్ శాసిస్తోందంటూ.. ఇందుకు ఐపీఎల్ కూడా భిన్నమేమీ కాదన్నారు. డిజిటల్ బూమ్ మద్దతుతో మీడియా హక్కులు 10 బిలియన్ డాలర్లను తెచ్చి పెడతాయని అభిప్రాయపడ్డారు. 

More Telugu News