University of Milan: సముద్రంలో కొట్టుకుపోయి.. ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి

  • మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దిలీప్
  • కోర్సు పూర్తయిన ఆనందంలో బీచ్‌కు 
  • ఒడ్డున కూర్చున్న అతడిని సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
Kurnool Student died in Italy

ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన కర్నూలు యువకుడు సముద్రంలో పడి మృతి చెందాడు. దీంతో కర్నూలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్నాడు. 2019 సెప్టెంబరులో మిలాన్ వెళ్లిన దిలీప్ గతేడాది ఏప్రిల్‌లో కర్నూలు వచ్చాడు. సెప్టెంబరులో తిరిగి వెళ్లాడు. కోర్సు పూర్తి కావడంతో ఉద్యోగం సంపాదించి కర్నూలు వస్తానని ఇటీవల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. 

పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ఏమరపాటున ఒడ్డున కూర్చున్న దిలీప్‌ను అలలు లాక్కెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన కోస్టుగార్డు సిబ్బంది రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అతడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More Telugu News