Sukesh Chandrashekhar: భార్యను ప్రతివారం కలిసేందుకు అనుమతివ్వాలంటూ.. జైలులో మళ్లీ నిరాహార దీక్ష చేస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్

  • తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్
  • అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న భార్య లీనా 
  • ప్రతి వారం కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ నిరాహార దీక్ష
  • మే 23 నుంచి ఆహారం ముట్టుకోని సుఖేష్
To meet wife conman Sukesh Chandrashekhar goes on another hunger strike inside Tihar jail

తనతోపాటు జైలులో శిక్ష అనుభవిస్తున్న భార్యను ప్రతివారం కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరోమారు నిరాహార దీక్షకు దిగాడు. గతంలోనూ ఇలాగే చేసిన సుఖేష్.. గత నెల 23 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో గత నాలుగు నెలలుగా సుఖేష్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి భార్య లీనా మరియా పాల్ కూడా అదే జైలులో శిక్ష అనుభవిస్తోంది. 

ఈ నేపథ్యంలో సుఖేష్ అభ్యర్థన మేరకు ప్రతి నెల మొదటి, మూడో శనివారం భార్య లీనాను కలిసేందుకు అనుమతిస్తున్నారు. అయితే, ప్రతి వారం తాము కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరసనకు దిగాడు. మళ్లీ మే 4 నుంచి 12 వరకు కూడా ఆహారం ముట్టుకోలేదు. దీంతో జైలు అధికారులు అతడికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు అందించారు. ఆ తర్వాత మే 12 నుంచి 22 వరకు అతడు ద్రవాహారం తీసుకున్నాడని, కానీ 23 నుంచి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం లేదని జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి గ్లూకోజ్‌లు అందిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News