Gangadhar Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి

  • అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో మృతి
  • ఆయన స్వస్థలం కడప జిల్లా పులివెందుల
  • శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి
Witness in YS Viveka murder case dead

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి (49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో ఆయన మరణించారు. నిద్రలోనే ఆయన చనిపోయినట్టుగా గుర్తించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించింది. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

గంగాధర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. పదేళ్ల క్రితం యాడికికి మకాం మార్చాడు. వివేకా హత్య కేసులో గత ఏడాది అక్టోబర్ 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. కేసు తనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు. అంతేకాదు, ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.

More Telugu News