Team India: హాట్ కేకుల్లా అమ్ముడైన టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ టికెట్లు.... వృద్ధుల కోసం గోల్ఫ్ కార్ట్స్

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచ్ ల సిరీస్
  • ఈ నెల 9న తొలి మ్యాచ్
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • ఇప్పటికే 94 శాతం టికెట్ల అమ్మకం
Golf Carts for senior citizens at Arun Jaitly stadium in Delhi during 1st T20 match between Team India and South Africa

ఇటీవల ఐపీఎల్ ముగియగా, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ సంరంభం షురూ అవుతోంది. టీమిండియాతో ఐదు టీ20 మ్యాచ్ లు ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చింది. ఇరుజట్ల మధ్య తొలి టీ20 గురువారం (జూన్ 9) నాడు ఢిల్లీలో జరగనుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం అందుబాటులో ఉంచిన టికెట్లు కొద్ది వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 35,000 కాగా... 27 వేల టికెట్లను అమ్మకానికి పెట్టారు. మిగతావి పాసుల రూపంలో కేటాయిస్తారు. 

అందుబాటులో ఉంచిన టికెట్లలో ఇప్పటికే 94 శాతం టికెట్లు అమ్ముడయ్యాయని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి రాజన్ మన్ చందా వెల్లడించారు. మరో 500 టికెట్ల వరకు మిగిలుంటాయని తెలిపారు.  

2019 నవంబరు తర్వాత ఢిల్లీలో ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం. కరోనా సంక్షోభం ఇంకా ముగియనందున ప్రేక్షకులు మాస్కులు ధరించి స్టేడియానికి రావాలని డీడీసీఏ విజ్ఞప్తి చేస్తోంది. 

కాగా, స్టేడియానికి వచ్చే వృద్ధులకు సౌకర్యంగా ఉండేందుకు గోల్ఫ్ కార్టులు వినియోగించనున్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి స్టేడియంలోకి వచ్చేందుకు వృద్ధులు గోల్ఫ్ కార్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని మన్ చందా పేర్కొన్నారు.

More Telugu News