Jubilee Hills: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: నిందితుల ఫొటోలు, వీడియోలు ఎమ్మెల్యే రఘునందన్‌కు ఎలా చేరాయంటూ పోలీసుల ఆరా

  • అత్యాచారం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం
  • ఎమ్మెల్యే రఘునందన్‌రావు విడుదల చేసిన ఫొటోలు, వీడియోలపై చర్చ
jubilee hills rape case police officials met in jubilee hills police station

సంచలనం సృష్టిస్తున్న జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల ఫొటోలు, వీడియోలను మీడియాకు చూపించారు. అయితే, ఈ ఫొటోలు, వీడియోలు ఆయనకు ఎలా చేరాయన్న దానిపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. 

కేసు దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఆ ఫొటోలు ఎలా చేరాయన్న విషయమై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సమావేశం అనంతరం డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ బాధితురాలి గుర్తింపును ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రసారం చేయొద్దని కోరారు.

More Telugu News