Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు

  • జూన్ 13న విచారణకు రావాలంటూ నోటీసులు
  • ఇప్పటికే ఇచ్చిన సమన్లపై రాహుల్ విజ్ఞప్తి మేరకు తేదీ పొడిగింపు
  • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకూ నోటీసులు
ED Issues Fresh Summons To Rahul Gandhi In National Herald Case

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజా సమన్లను జారీ చేసింది. కేసులో విచారణకు జూన్ 2న హాజరు కావాలంటూ ఇటీవల రాహుల్ గాంధీకి, జూన్ 8న హాజరు కావాలంటూ సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, విచారణకు వచ్చేందుకు తనకు కొంత సమయం కావాలని, తేదీని మార్చాలన్న రాహుల్ విజ్ఞప్తి మేరకు ఈడీ తేదీని పొడిగించింది. జూన్ 13న విచారణకు రావాలంటూ నోటీసులను జారీ చేసింది. 

రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థను గాంధీలు పొందారని, నిధులను దుర్వినియోగం చేశారని, భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ఏజేఎల్ లో షేర్ హోల్డర్లయిన మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్, అలహాబాద్, మద్రాస్ హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్ మార్కండేయ కట్జూలకు తెలియకుండానే షేర్లను కంపెనీ పేరిట ట్రాన్స్ ఫర్ చేశారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. రూ.2 వేల కోట్ల ఆస్తులను చేజిక్కించుకునేందుకు ఏజేఎల్ తో పాటు నేషనల్ హెరాల్డ్ షేర్లను కూడా తప్పుడు మార్గంలో గాంధీలు బదలాయించుకున్నారని ఆ పిల్ లో సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

More Telugu News