BJP: తెలంగాణ కోసం నాడు లోక్‌స‌భ‌లో సుష్మా స్వ‌రాజ్ గ‌ళం!... వీడియో పోస్ట్ చేసిన కిష‌న్ రెడ్డి!

  • నాడు టీఆర్ఎస్ ఎంపీలుగా కేసీఆర్‌, విజ‌య‌శాంతి
  • తెలంగాణ కోసం నిత్యం పోడియం వ‌ద్ద నిర‌స‌న‌
  • ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌పై మాట్లాడిన సుష్మా స్వ‌రాజ్‌
kishan reddy posts Sushma Swaraj speech favour of telangana in loksabha

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గురువారం ఓ అరుదైన వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ దివంగ‌త మ‌హిళా నేత‌, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వ‌రాజ్ లోక్‌స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ‌గా చేసిన కీల‌క ప్రసంగం వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం అయినా కూడా, నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ స‌భ‌లోనే ఉన్నా కూడా సుష్మా స్వ‌రాజ్ అన‌ర్గ‌ళంగా అలా మాట్లాడుతూ ఉంటే.. ప్ర‌ధాని స‌హా డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురైలు అలా చూస్తుండిపోయారు. 

అయితే ఈ వీడియోలో ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం కూడా క‌నిపించింది. నాడు టీఆర్ఎస్ త‌ర‌ఫున ఎంపీలుగా కొన‌సాగుతున్న ప్ర‌స్తుత సీఎం కేసీఆర్, ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న విజ‌య‌శాంతిలు సుష్మా స్వ‌రాజ్ ప‌క్క‌నే క‌నిపించారు. వాస్త‌వానికి తెలంగాణ కోసం ఉద్య‌మం సాగిస్తున్న కేసీఆర్ ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా లోక్ స‌భ‌లో వినియోగించుకునే వారు. అలా లోక్ స‌భ స‌మావేశాల్లో భాగంగా నిత్యం పోడియం ముందే నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కేసీఆర్‌, విజ‌య‌శాంతి క‌నిపించేవారు. వారిని అలా చూసిన నేప‌థ్యంలోనే సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ కీల‌క ప్ర‌సంగం చేశారు.

More Telugu News